
డ్రగ్స్ వినియోగం చట్ట వ్యతిరేకం, ప్రాణాంతకమని బీబీనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎన్జీఓ ఆధ్వర్యంలో గురువారం బీబినగర్లో మాదకద్రవ్యాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ అరాచక శక్తులు యువతను మాదకద్రవ్యలకు అలవాటు చేసి జీవితాలను నాశనం చేస్తున్నారని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం అరికట్టేందుకు హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎన్జీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మాదకద్రవ్యాలను వాడడం చట్ట వ్యతిరేకమని, యువత, తల్లిదండ్రులు మాదకద్రవ్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అన్నపూర్ణ అన్నదానం ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. అన్నపూర్ణ అన్నదానం ట్రస్ట్ సభ్యులు వెంకటేష్, శశికాంత్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వాడకంతో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని అన్నారు. మాదకద్రవ్యల భారీన పడిన బాధితులను గుర్తించి వారికి అవసరమైన సహాయ సూచనలు అందించాలని, పోలీస్, న్యాయ వ్యవస్థలు అందుకు అన్ని విధాలుగా సహకరిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్-ఇన్స్పెక్టర్ ఎన్. రమేష్, ట్రస్ట్ సభ్యులు చెన్నోజు నర్సింహ చారి, పులిగిళ్ల సాయి కిరణ్, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.



